నాసిక్ లో లాయర్ వృత్తి చేసుకునే ఎస్. భి.ధుమాల్ (బి.ఎ,ఎల్.ఎల్.బి) తొలుత శ్రీ గజానన్ మహారాజు భక్తుడు. షేవ్ గావ్ కు తరచుగా కుటుంబ సభులతో వెళ్ళి మహరాజును దర్శించుకుంటుండేవాడు. నాసిక్ లో సాటి భక్తులతో కలిసి సద్గంధ పఠన,సత్సంగం చేస్తుండేవాడు. స్నేహితుల బలవంతం మీదట 1907 లో తొలిసారిగా శిరిడీ దర్శించాడు.
బాబా వారి తొలి దర్శనంతోనే ఎంతో పారవశ్యం చెంది మనసులో బాబానే తన గురువుగా సంకల్పం చేసుకున్నాడు. తర్వాత తన స్నేహితుడు శ్రీమాన్ గోపాలరావు బూటీని శిరిడీ తీసుకు వెళ్ళి బాబా దర్శనం చేయించాడు. ఈ గోపాలరావు బూటీనే 1915 వ సంవత్సరంలో శ్రీ సాయి సమాధి మందిరం (బూటీ వాడా లేక దగడీ వాడా) ను నిర్మించి విశ్వ విఖ్యాతి గాంచాడు. ఈ విధంగా బూటీని బాబాకు పరిచయం చెసిన భక్తునిగా ధుమాల్ కు సాయి సచ్చరిత్రలో ప్రత్యేక స్థానం లభించింది.
ఒకసారి బాబా దర్శనం చేసుకున్నాక ఆయన ధుమాల్ తో “ నేను నిన్ను ప్రతీ అడుగులోనూ సంరక్షిస్తున్నాను. నేను లేకపోతే నీ పరిస్థితి ఏమై పోయి వుండేదో అల్లాకే ఎరుక “ అని అన్నారు.
నాసిక్ లో అప్పట్లో తన కుటుంబ సభులతో తన పూర్వీకుల ఇంట్లో ధుమాల్ నివసిస్తుండేవాడు. ఆ సంవత్సరంలో ప్లేగు వ్యాధి చెలరేగి ఎలుకలు ఎక్కడ పడితే అక్కడ చచ్చి పడసాగాయి. వెంటనే ప్రాణ భయంతో ఇల్లు మారడానికి బాబా అనుమతి కోరగా ఆయన సరేనన్నారు.
వెంటనే నాసిక్ కు దగ్గరలోని గ్రామంలో ఒక బంగళాకు ధుమాల్ కుటుంబం మారిపోయింది.
ఆ రోజు రాత్రే తన సొదరుడి కుమారుడి మంచం పక్కన చచ్చిపడిన ఒక ఎలుక వారికి కనిపించింది. ఈ ప్రదేశం లో కూడా ప్లేగు వ్యాధి సోకే అవకాశం వున్నందున పరిస్థితి వివరిస్తూ మళ్ళీ ఆ ఇల్లు మారడానికి అనుమతి నివ్వమని ధుమాల్ బాబాకు లేఖ రాసాడు. ఇసారి చిత్రంగా బాబా నుండి ఇల్లు మారవద్దని జవాబు వచ్చింది.
తర్వాత పనివారి క్వార్టర్ లోనూ, చుట్టు పక్కల వారి ఇళ్ళలోనూ ఆఖరుకు మంచి నీటి బావిలో కూడా చచ్చిపోయిన ఎలుకలు దర్శనమివ్వసాగాయి. ఈక పరిస్థితి ఇలానే కొనసాగితే ప్లేగు వ్యాధిన తాము పడడం ఖాయమని తలిచి ప్రాణ భయంతో పరిస్థితులను వివరిస్తూ బాబాకు సవివరంగా మరొక లేఖ వ్రాసాడు ధుమాల్.
ఈసారి పరిస్థితి తీవ్రతను గుర్తించి బాబా తప్పక అనుమతి నిస్తారని భావించి సామానంతటినీ సర్ధుకొని ఊరికి దూరంగా మరొక ఇంటికి తరలించి ఇల్లు తాళం పెట్టబోతుండగా శిరిడీ నుండి వుత్తరం వచ్చింది. అందులో బాబా” నేనుండగా నీవు భయపడనేల ? నీ రక్షకుడు నైన నపై విశ్వాసం వుంచి ధైర్యంగా ఆ ఇంట్లోనే వుండండి. మీకెట్టి ఆపద కలగదు “ అని జాబు వ్రాయించారు. ఆ లేఖ చదివిన తర్వాత ధుమాల్ తీవ్రమైన మీమాంసలో పడిపోయాడు. బాబా అభయం ఒక వైపు…. ప్రాణ భయం మరొక వైపు .ఏం చెయ్యాలో,ఎటు వంటి నిర్ణయం తీసుకోవాలో అతనికి తోచలేదు.ఆఖరుకు బాబాపై పూర్తి భరోసాతో తిరిగి అదే ఇంట్లో వుండనారంభించాడు. అతని నిర్ణయం విన్న చుట్టు పక్కల వారు ధుమాల్ ను తీవ్రంగా విమర్శించారు.మూఢ నమ్మకాలతో ప్రాణాలను బలి పెట్టవద్దని హితవు పలికారు. అయినా సద్గురువు పట్ల కొండంత విశ్వాసంతో ధుమాల్ తన నిర్ణయం మార్చుకోలేదు. బాబా తనకు అభయం ఇచ్చాక ఇక తనకు చింత ఏల అని ధృడంగా అనుకున్నాడు.
త్రాగే నీటి కోసం దగ్గరలో వున్న గోదావరి నది నుండి పని వారి చేత మోయించుకునేవాడు. రోజుకు పదిహేను-ఇరవై దాకా ఎలుకలు చచ్చిపోయేవి. చుట్టు పక్కల ఇళ్ళలో ప్లేగు వ్యాధి బారిన పడి మరణించిన సంఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి.అయితే ధుమాల్, అతని కుటుంబ సభులు సాయి ఆరాధన,సాయి నామ జపం,సద్గ్రంధ పఠన ఇత్యాది సాధనలను మమ్మురం చేస్తూ శ్రీ సాయిపై తమ పూర్తి భారాన్ని మోపి నిశ్చింతగా వున్నారు.
చుట్టు పక్కల విజృంభించిన ప్లేగు వ్యాధి శ్రీ సాయినాధుని కృప వలన ఆ ఇంటి దరిదాపులకు చేరలేదు. ఛివరకు ఆ కష్ట కాలం నుండి ఎంతో సురక్షితంగా బయట పడ్డారు. త్రికరణ శుద్ధిగా విశ్వసించి కొలచిన వారికి శ్రీ సాయినాధుని కృప,అభయం వలన ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు దరి చేరవని పై లీల వలన అందరూ తెలుసుకున్నారు.
సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు
లోకా స్సమస్తా సుఖినోభవంతు
2 comments:
నమస్కారం!
తత్వ విశ్లేషణ గురించి మేము కొంత విషయం సేకరించి మా యొక్క బ్లాగ్లో పొందుపర్చటమయినది.
దాని పై మీ అమూల్యమయిన అభిప్రాయాలు మరియు మీ సలహాలు అందిస్తారని ఆశిస్తున్నాము.
మా బ్లాగ్ యొక్క url http://tatvavisleshana.blogspot.com/
ఇట్లు,
తత్వ విశ్లేషణ టీం
శ్రీ శిరిడి సాయి లీలామృతం-202 చదివేను.మనస్సుకు హాయిగా ఉంది.
url:http://sujana-srujana.blogspot.com/
Post a Comment