Sunday 25 August 2013

శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ దివ్య లీలామృతం (అధ్యాయ- 07)


దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మసంస్థాపన ల కోసం పంంధొమిదో శతాబ్దం లో ఈ భువిపై వెలసిన సమర్ధ సద్గురువు శ్రీ సాయినాధులు. తనను మనస్పూర్తిగా విశ్వసించిన తన భక్తులకు ఎళ్ళవేళలా వెన్నంటి వుండి వారికి తన అమూల్యమైన, అభేఢ్యమైన రక్షణ కవచం అందించడమే కాక, తన బోధలతో, ఉపదేశములతో వారిలో పరివర్తన గావించి , సన్మార్గంలో నడిపించే అద్భుతమైన దైవం శ్రీ సాయి. శ్రీ సాయిని నమ్మైన లక్షలాది మంది ఈనాటికీ సుఖ సంతోషాలతో, అయు: ఆరోగ్యాలతో జీవిస్తున్నారు. శ్రీ సాయి తన భక్తులను రక్షించి, వారి సమస్యనను, చింతలను, దూరం చేసే పద్ధతి చాలా విచిత్రమైనది. ఆది ఏ సాంప్రదాయాలకు, మతాలకు చెందనిది.అటువంటి ఒక విచిత్రమైన లీలను ఇప్పుడు స్మరించుకుందాము.



శ్రీ సాయికి అత్యంత సన్నిహిత , ముఖ్యమైన భక్తుడైన బాపూసాహెబ్ బూటీ ఒకసారి జిగట ఇరోచనముల వలన తీవ్రంగా బాధపడ్డాడు. స్వతాహాగా ధనవంతుడవడం వలన ఎందరో ప్రసిద్ధులైన డాక్టర్లకు చూపించుకొని వారిచ్చిన మందులను వాడాడు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. కొద్ది రోజులలోనే బూటీ బాగా నీరసించిపోయాడు. కదల లేకపోవాడం వలన శ్రీ సాయి దర్శనానికై మశీదుకు పోలేకపోయాడు. అప్పుడు బాబా అతనిని మశీదుకు రమ్మని కబురు పంపించి, బూటీ రగానే తన ముందు కూర్చోబెట్టుకొని తన చూపుడు వేలు ఆడించుచూ “ తస్మాత్ జాగ్రత్త ! నీవిక విరేచనములను చేయకూడదు “ అని దృఢంగా పలికారు. అఖిలాంఢకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధి రాజు అయిన బాబా ఆ మాటలను అనగానే వెంటనే విరేచనాలు ఆగిపోయాయి. గొప్ప గొప్ప దాక్టర్లు, విలువైన మందులు కుదర్చలేని జబ్బును ఆ మహానుభావుడు కేవలం తన మాటలతో కుదిర్చిన వైనం అత్యంత విశిష్టమైనది.


మరొక సంధర్బంలో బూటీకి కలరా వ్యాధి సోకింది.ఒక రోజులోనే తీవ్రంగా నీరసించిపోయాడు. ఏ విధమైన ఆహారాన్ని, కనీసం నీరును కుడా తాగలేకపోయాడు.బూటీకి సన్నిహితుడైన దాక్టర్ పిళ్ళై తన వద్ద వున్న ఔషఢములనింటినీ ప్రయత్నించాడు కానీ అవి కొద్దిపాటి ఉపశమనాన్ని కూడా ఇవ్వలేకపోయాయి. అప్పుడు బూటీ మశీదుకు వెళ్ళి బాబా కాళ్ళపై పడి తన వ్యాధిని తగ్గించమని ప్రాధేయపడ్దాడు. అప్పుడు శ్రీ సాయి బాదాము పప్పు, పిస్తా,అక్రోటులను బాగా నానబెట్టి, పాలు, చక్కెరలో ఉడికించి సేవించమని చేప్పారు.ఆ మాటలను విన్న వారందరూ ఎంతగానో ఆశ్చర్య పోయారు.ఎందుకంటే వైద్య శస్త్రం ప్రకారం ఈ మిశ్రమాన్ని సేవిస్తే జబ్బు మరింత తీవ్రమై చివరకు ప్రాణాలకే ముప్పు కలుగవచ్చును. కానీ బూటీ బాబా ఆజ్ఞను శిరసావహించి ఆ మిశ్రమాన్ని సేవించాడు. చిత్రాతి చిత్రంగా బూటీ యొక్క కలరా వ్యాధి కొద్ది గంటలలో నే తగ్గిపోయి అతనికి పూర్తి స్వస్థత చేకూరింది.


ఈ విధంగా వైద్య విజ్ఞాన శాస్త్రాలన్నింటికీ విరుద్ధంగా బాబా తనదైన ప్రత్యేక శైలిలో తన భక్తుల రోగాలను తగ్గించివేసారు. ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే బాబా మాటలే ఈ ప్రకృతి అంతటికీ శిరోధార్యం.బాబా పలుకులే వేద, విజ్ఞాన శాస్త్రాలు.సాంప్రదాయములు, ఆచార వ్యవహారములు, మంత్ర శక్తులు ,వైద్య విధానములు అన్నీ బాబా యొక్క అపూర్వమైన యోగ శక్తి ముందు దిగదుడుపే !బాబా అజ్ఞలను శిరసా వహించువారికి ఆయన యొక్క అనుగ్రహ , కరుణా కటాక్షములు లభ్యమై జీవితం ఆనందంగా, సాఫిగా సాగిపోతుంది.

సర్వం శ్రీ శిరిడీ సాయి పాదారవిందార్పణమస్తు


సర్వేజనా సుఖినోభవంతు

Thursday 15 August 2013

శ్రీ శిరిడీ సాయి లీలామృతం (అధ్యాయం - 06)


శ్రీకృష్ణుడు భగవద్గీతలో తనకు అర్పించకుండా భుజించిన ఆహారము పాపభూయిష్టమైనదని , అందువలన నిష్కృతి లేని పాపాలను మూటగట్టుకుందురని . అదేవిధంగా భగవంతునికి అర్పించి, పావనం చేసిన పిమ్మట తీసుకున్న ఆహారం అమృతతుల్యమని అందువలన జీవునకు ఇహం లోనూ , పరం లోనూ శ్రేయస్సు కలుగుతుంగని సెలవిచ్చి ఉన్నారు. ఈ గీతా సారాన్ని కలియుగ దైవం , భక్తుల పాలిటి కల్పవృక్షం అయిన శ్రీసాయినాధులు తనదైన రీతిలో భక్తులకు బోధించారు. ఆ లీలను ఇప్పుడు స్మరించుకుందాము.

శిరిడీలో ప్రతీ ఆదివారం సంత జరిగేది. చుట్టు పక్కల గ్రామాలనుండి ప్రజలు వచ్చి ఆ వారానికి కావలసిన సరుకులను కొనుకొని తిరిగి వెళ్ళిపోయేవారు.వెళ్ళెముందు వారు మశీదుకు వచ్చి సాయిని దర్శించుకోవడం ఒక అలవాటు. ఒక ఆదివారం ఎప్పటివలెనే మశిదు కిక్కిరిసిపోయి వున్నాది.

హేమాద్రిపంత్ బాబా ముందు కూర్చోని ఆయన పాదములను ఒత్తుతూ మనస్సులో నామజపం చేసుకుంటున్నాడు. బాబా గారి ఎడమవైపున శ్యామా, కుడివైపున బూటీ, కాకా దీక్షిత్ కుడా కూర్చోని వున్నారు. అప్పుడు శ్యామ నవ్వుతూ, " హేమాద్రిపంత్ జీ, నీ కోటుకు శనగ గింజలు అంటినవి చూడు " అని అన్నాడు. అంతే కాక హేమాద్రిపంత్ చొక్కా చేతులను తట్టగా కొన్ని శనగ గింజలు రాలిపడ్డయి.హేమాద్పంత్ వెంటనె తన చేతులను ముందుకు చాచగే మరి కొన్ని శనగపు గింజలు రాలి పడ్దాయి.

ఈ సంఘటనకు అందరూ ఆశ్చర్యపడ్డారు. శనగలు చోక్కా చేతుల లోపలకు ఎలా ప్రవేశించాయో ఎవరికి తోచినట్లు వారు ఊహించనారంభించారు. అప్పుడు శ్రీసాయి కల్పించుకొని " ఆ హేమాద్పంతుకు తాను తిన్నప్పుడు ఇంక ఎవ్వరికీ పెట్టని దుర్గుణము వున్నాది. ఈ రోజు సంతలో శనగలు కొని తానొక్కాడే తంటూ ఇకడికి వచ్చాడు" అని అన్నారు. సాయి మాటలకు హేమాడ్పంతు ఒకింత ఆశ్చర్య పడి " బాబా ! నేనెప్పుడూ దేనినీ ఒంటరిగా తిని ఎరుగను. ఈ రోజు దాకా శిరిడీ లోని సంత ఎక్కడ జరుగుతుందో కూడా నాకు తెలియదు.ఈ రోజు కూడా నేను సంతకు వెళ్ళలేదు, అయినప్పుడు నేను శనగలు ఎలా కొని వుండగలను ?నా దగ్గర ఏ వస్తువైనా వున్నప్పుడు దానిని దగ్గర వున్నవారికి పంచి ఇవ్వకుండా నేనొక్కడినీ తినే అలవాటు నాకు లేదు. అటువంటప్పుడు ఈ దుర్గుణమును , అభాండమును ఏల నాపై మోపెదవు ? " అని అడిగాడు.అప్పుడు సాయి చిరునవ్వుతో " భావూ (తమ్ముడా !)దగ్గర వున్నప్పుడు ఇంకొకరికి పంచి ఇస్తావు కానీ ఎవరూ లేన్నప్పుడు ఏం చేస్తావు? తినెటప్పుడు కనీసం నన్ను స్మరిస్తావా ?నేనెల్లప్పుడు నీ చెంత లేనా ?నీవేదైనా తిన్నేటప్పుడు నాకు అర్పిస్తున్నావా ?" ఆ మాటలకు హేమాద్పంత్ ముఖం చిన్నబోయింది. బాబా మాటలలోని అర్ధం అక్కడు కూర్చున్న వారందరికీ అవగతమై అందరి అజ్ఞానం పటాపంచలు అయ్యి జ్ఞానోదయం అయ్యింది.

హేమాద్పంత్ శనగలు తినుటను ఆసరాగా చేసుకొని శ్రీ సాయి ఒక అద్భుతమైన, అపూర్వమైన బోధను చేసారు.మనస్సు, బుద్ధి పంచేంద్రియముల కంటే ముందుగా విషయములను అనుభవిస్తాయి, కనుక మమము ముందే ఏ విషయానైననూ భగవదర్పితం చేయాలి.అప్పుడు మనకు ఆ విషయములందు అభిమానము అదృశ్యమైపోతుంది.విషయములను అనుభవించే మూందు బాబా మన చెంతనే వున్నట్లు భావించినచో ఆ వస్తువును మనము అనుభవించవచ్చునా లేదా అన్న ప్రశ్న ఉదయించి తద్వారా వైరాగ్యం, వివేకము ఉదయిస్తాయి. అధ్యాత్మిక జీవితంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.మనము మన సద్గురువును లేదా ఇష్ట దైవమును స్మరించనిదే ఏ పనినీ చేయరాదు. మనస్సును ఈ విధముగా క్రమశిక్షణతో వుంచినట్లయితే శ్రీఘ్రమే ఆ సద్గురువు యొక్క అపూర్వమైన,అత్యద్భుతమైన కరుణా కటాక్షాలకు పాత్రులమవుతాము.
శ్రీ సాయి చేసిన ఈ భోధనామృతమును మనసారా వంటబట్టించుకొని భక్తులందరూ తమ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు


సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణ మస్తు