Sunday 25 August 2013

శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ దివ్య లీలామృతం (అధ్యాయ- 07)


దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మసంస్థాపన ల కోసం పంంధొమిదో శతాబ్దం లో ఈ భువిపై వెలసిన సమర్ధ సద్గురువు శ్రీ సాయినాధులు. తనను మనస్పూర్తిగా విశ్వసించిన తన భక్తులకు ఎళ్ళవేళలా వెన్నంటి వుండి వారికి తన అమూల్యమైన, అభేఢ్యమైన రక్షణ కవచం అందించడమే కాక, తన బోధలతో, ఉపదేశములతో వారిలో పరివర్తన గావించి , సన్మార్గంలో నడిపించే అద్భుతమైన దైవం శ్రీ సాయి. శ్రీ సాయిని నమ్మైన లక్షలాది మంది ఈనాటికీ సుఖ సంతోషాలతో, అయు: ఆరోగ్యాలతో జీవిస్తున్నారు. శ్రీ సాయి తన భక్తులను రక్షించి, వారి సమస్యనను, చింతలను, దూరం చేసే పద్ధతి చాలా విచిత్రమైనది. ఆది ఏ సాంప్రదాయాలకు, మతాలకు చెందనిది.అటువంటి ఒక విచిత్రమైన లీలను ఇప్పుడు స్మరించుకుందాము.



శ్రీ సాయికి అత్యంత సన్నిహిత , ముఖ్యమైన భక్తుడైన బాపూసాహెబ్ బూటీ ఒకసారి జిగట ఇరోచనముల వలన తీవ్రంగా బాధపడ్డాడు. స్వతాహాగా ధనవంతుడవడం వలన ఎందరో ప్రసిద్ధులైన డాక్టర్లకు చూపించుకొని వారిచ్చిన మందులను వాడాడు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. కొద్ది రోజులలోనే బూటీ బాగా నీరసించిపోయాడు. కదల లేకపోవాడం వలన శ్రీ సాయి దర్శనానికై మశీదుకు పోలేకపోయాడు. అప్పుడు బాబా అతనిని మశీదుకు రమ్మని కబురు పంపించి, బూటీ రగానే తన ముందు కూర్చోబెట్టుకొని తన చూపుడు వేలు ఆడించుచూ “ తస్మాత్ జాగ్రత్త ! నీవిక విరేచనములను చేయకూడదు “ అని దృఢంగా పలికారు. అఖిలాంఢకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధి రాజు అయిన బాబా ఆ మాటలను అనగానే వెంటనే విరేచనాలు ఆగిపోయాయి. గొప్ప గొప్ప దాక్టర్లు, విలువైన మందులు కుదర్చలేని జబ్బును ఆ మహానుభావుడు కేవలం తన మాటలతో కుదిర్చిన వైనం అత్యంత విశిష్టమైనది.


మరొక సంధర్బంలో బూటీకి కలరా వ్యాధి సోకింది.ఒక రోజులోనే తీవ్రంగా నీరసించిపోయాడు. ఏ విధమైన ఆహారాన్ని, కనీసం నీరును కుడా తాగలేకపోయాడు.బూటీకి సన్నిహితుడైన దాక్టర్ పిళ్ళై తన వద్ద వున్న ఔషఢములనింటినీ ప్రయత్నించాడు కానీ అవి కొద్దిపాటి ఉపశమనాన్ని కూడా ఇవ్వలేకపోయాయి. అప్పుడు బూటీ మశీదుకు వెళ్ళి బాబా కాళ్ళపై పడి తన వ్యాధిని తగ్గించమని ప్రాధేయపడ్దాడు. అప్పుడు శ్రీ సాయి బాదాము పప్పు, పిస్తా,అక్రోటులను బాగా నానబెట్టి, పాలు, చక్కెరలో ఉడికించి సేవించమని చేప్పారు.ఆ మాటలను విన్న వారందరూ ఎంతగానో ఆశ్చర్య పోయారు.ఎందుకంటే వైద్య శస్త్రం ప్రకారం ఈ మిశ్రమాన్ని సేవిస్తే జబ్బు మరింత తీవ్రమై చివరకు ప్రాణాలకే ముప్పు కలుగవచ్చును. కానీ బూటీ బాబా ఆజ్ఞను శిరసావహించి ఆ మిశ్రమాన్ని సేవించాడు. చిత్రాతి చిత్రంగా బూటీ యొక్క కలరా వ్యాధి కొద్ది గంటలలో నే తగ్గిపోయి అతనికి పూర్తి స్వస్థత చేకూరింది.


ఈ విధంగా వైద్య విజ్ఞాన శాస్త్రాలన్నింటికీ విరుద్ధంగా బాబా తనదైన ప్రత్యేక శైలిలో తన భక్తుల రోగాలను తగ్గించివేసారు. ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే బాబా మాటలే ఈ ప్రకృతి అంతటికీ శిరోధార్యం.బాబా పలుకులే వేద, విజ్ఞాన శాస్త్రాలు.సాంప్రదాయములు, ఆచార వ్యవహారములు, మంత్ర శక్తులు ,వైద్య విధానములు అన్నీ బాబా యొక్క అపూర్వమైన యోగ శక్తి ముందు దిగదుడుపే !బాబా అజ్ఞలను శిరసా వహించువారికి ఆయన యొక్క అనుగ్రహ , కరుణా కటాక్షములు లభ్యమై జీవితం ఆనందంగా, సాఫిగా సాగిపోతుంది.

సర్వం శ్రీ శిరిడీ సాయి పాదారవిందార్పణమస్తు


సర్వేజనా సుఖినోభవంతు

Thursday 15 August 2013

శ్రీ శిరిడీ సాయి లీలామృతం (అధ్యాయం - 06)


శ్రీకృష్ణుడు భగవద్గీతలో తనకు అర్పించకుండా భుజించిన ఆహారము పాపభూయిష్టమైనదని , అందువలన నిష్కృతి లేని పాపాలను మూటగట్టుకుందురని . అదేవిధంగా భగవంతునికి అర్పించి, పావనం చేసిన పిమ్మట తీసుకున్న ఆహారం అమృతతుల్యమని అందువలన జీవునకు ఇహం లోనూ , పరం లోనూ శ్రేయస్సు కలుగుతుంగని సెలవిచ్చి ఉన్నారు. ఈ గీతా సారాన్ని కలియుగ దైవం , భక్తుల పాలిటి కల్పవృక్షం అయిన శ్రీసాయినాధులు తనదైన రీతిలో భక్తులకు బోధించారు. ఆ లీలను ఇప్పుడు స్మరించుకుందాము.

శిరిడీలో ప్రతీ ఆదివారం సంత జరిగేది. చుట్టు పక్కల గ్రామాలనుండి ప్రజలు వచ్చి ఆ వారానికి కావలసిన సరుకులను కొనుకొని తిరిగి వెళ్ళిపోయేవారు.వెళ్ళెముందు వారు మశీదుకు వచ్చి సాయిని దర్శించుకోవడం ఒక అలవాటు. ఒక ఆదివారం ఎప్పటివలెనే మశిదు కిక్కిరిసిపోయి వున్నాది.

హేమాద్రిపంత్ బాబా ముందు కూర్చోని ఆయన పాదములను ఒత్తుతూ మనస్సులో నామజపం చేసుకుంటున్నాడు. బాబా గారి ఎడమవైపున శ్యామా, కుడివైపున బూటీ, కాకా దీక్షిత్ కుడా కూర్చోని వున్నారు. అప్పుడు శ్యామ నవ్వుతూ, " హేమాద్రిపంత్ జీ, నీ కోటుకు శనగ గింజలు అంటినవి చూడు " అని అన్నాడు. అంతే కాక హేమాద్రిపంత్ చొక్కా చేతులను తట్టగా కొన్ని శనగ గింజలు రాలిపడ్డయి.హేమాద్పంత్ వెంటనె తన చేతులను ముందుకు చాచగే మరి కొన్ని శనగపు గింజలు రాలి పడ్దాయి.

ఈ సంఘటనకు అందరూ ఆశ్చర్యపడ్డారు. శనగలు చోక్కా చేతుల లోపలకు ఎలా ప్రవేశించాయో ఎవరికి తోచినట్లు వారు ఊహించనారంభించారు. అప్పుడు శ్రీసాయి కల్పించుకొని " ఆ హేమాద్పంతుకు తాను తిన్నప్పుడు ఇంక ఎవ్వరికీ పెట్టని దుర్గుణము వున్నాది. ఈ రోజు సంతలో శనగలు కొని తానొక్కాడే తంటూ ఇకడికి వచ్చాడు" అని అన్నారు. సాయి మాటలకు హేమాడ్పంతు ఒకింత ఆశ్చర్య పడి " బాబా ! నేనెప్పుడూ దేనినీ ఒంటరిగా తిని ఎరుగను. ఈ రోజు దాకా శిరిడీ లోని సంత ఎక్కడ జరుగుతుందో కూడా నాకు తెలియదు.ఈ రోజు కూడా నేను సంతకు వెళ్ళలేదు, అయినప్పుడు నేను శనగలు ఎలా కొని వుండగలను ?నా దగ్గర ఏ వస్తువైనా వున్నప్పుడు దానిని దగ్గర వున్నవారికి పంచి ఇవ్వకుండా నేనొక్కడినీ తినే అలవాటు నాకు లేదు. అటువంటప్పుడు ఈ దుర్గుణమును , అభాండమును ఏల నాపై మోపెదవు ? " అని అడిగాడు.అప్పుడు సాయి చిరునవ్వుతో " భావూ (తమ్ముడా !)దగ్గర వున్నప్పుడు ఇంకొకరికి పంచి ఇస్తావు కానీ ఎవరూ లేన్నప్పుడు ఏం చేస్తావు? తినెటప్పుడు కనీసం నన్ను స్మరిస్తావా ?నేనెల్లప్పుడు నీ చెంత లేనా ?నీవేదైనా తిన్నేటప్పుడు నాకు అర్పిస్తున్నావా ?" ఆ మాటలకు హేమాద్పంత్ ముఖం చిన్నబోయింది. బాబా మాటలలోని అర్ధం అక్కడు కూర్చున్న వారందరికీ అవగతమై అందరి అజ్ఞానం పటాపంచలు అయ్యి జ్ఞానోదయం అయ్యింది.

హేమాద్పంత్ శనగలు తినుటను ఆసరాగా చేసుకొని శ్రీ సాయి ఒక అద్భుతమైన, అపూర్వమైన బోధను చేసారు.మనస్సు, బుద్ధి పంచేంద్రియముల కంటే ముందుగా విషయములను అనుభవిస్తాయి, కనుక మమము ముందే ఏ విషయానైననూ భగవదర్పితం చేయాలి.అప్పుడు మనకు ఆ విషయములందు అభిమానము అదృశ్యమైపోతుంది.విషయములను అనుభవించే మూందు బాబా మన చెంతనే వున్నట్లు భావించినచో ఆ వస్తువును మనము అనుభవించవచ్చునా లేదా అన్న ప్రశ్న ఉదయించి తద్వారా వైరాగ్యం, వివేకము ఉదయిస్తాయి. అధ్యాత్మిక జీవితంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.మనము మన సద్గురువును లేదా ఇష్ట దైవమును స్మరించనిదే ఏ పనినీ చేయరాదు. మనస్సును ఈ విధముగా క్రమశిక్షణతో వుంచినట్లయితే శ్రీఘ్రమే ఆ సద్గురువు యొక్క అపూర్వమైన,అత్యద్భుతమైన కరుణా కటాక్షాలకు పాత్రులమవుతాము.
శ్రీ సాయి చేసిన ఈ భోధనామృతమును మనసారా వంటబట్టించుకొని భక్తులందరూ తమ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు


సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణ మస్తు

Friday 26 July 2013

శ్రీ శిరిడీ సాయి లీలామృతం ( అధ్యాయం - 5 )


ఈ కలియుగంలో మనము ప్రతీ క్షణం తెలిసో, తెలియకో ఎన్నొ పాపాలను చేస్తూ వుంటాం. ధనార్జనే పరమావధిగా బ్రతికే మానవునికి తన దైనందిన జీవితంలో దైవానికి, గురువుకు స్థానం లేకుండా చేసేసుకున్నాడు. తత్ఫలితంగా ఎన్నొ సమస్యలకు, అశాంతికి, ఆందొళనలకు గురవుతున్నాడు. కాని గురువుకు సర్వస్య శరణాగతి చేసిన వారు మాత్రం ఆ గురువు యొక్క అపూర్వ కరుణా కటాక్షాలకు పాత్రులగుతూ ఎంతో సంతోషకరమైన జీవితం అనుభవిస్తున్నారు. అంటే దీనర్ధం గురువు భక్తులకు చింతలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు వుండవని కాదు.కల్లోల కడలిలో క్రుంగిపోతున్నా , తన భక్తులను ఆ గురువే వచ్చి రక్షించి, వారిని ఈ సంసారమనే కడలి నుండి సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడు. ఆ సద్గురువును నమ్ముకున్న వారు మరింక ఏ విషయం గురించి ఆలోచించనవసరం లేదు. హాయిగా తమ బరువు బాధ్యతలను ఆ సద్గురువు పాదాలకు అప్పగించి నిశ్చింతగా వుండవచ్చు.ఈ సత్యాన్ని గ్రహించిన వారు ధన్యులు. మిగితా వారు మాత్రం అనుక్షణం ఆ బరువు బాధ్యతలను మోయలేక మోస్తూ, కృంగిపోతూవుంటారు.



ఈ కలియుగంలో ఆ సద్గురువుకు సర్వస్య శరణాగతి చెయ్యడమే సాధనమని తెలుసుకున్నాము కదా ! అట్లే సద్గురువు యొక్క బోధలే మనకు వేద శాస్త్రాలు.ఆయన చెప్పిన మార్గమే మనకు అనుసరణీయం.తన భక్తులకు సమర్ధ సద్గురువైన సాయి ఎన్నో బోధలను చేస్తుండేవారు. ఆయనకు బోధలను చేయడానికి ప్రత్యేక సమయం కాని, స్థలం కాని, సమయం కాని అవసరం లేకుండేది. సంధర్భావసరముల బట్టి వారి ప్రభోధము నిరంతరం జరుగుతూ వుండేది. ఓకనాడు ఒక భక్తుడు మశీదులో తన తోటి భక్తుని గురించి విమర్శించసాగాడు. ఆ తోటి భక్తుడు చేసిన మంచి పనులను విడిచి అతడు చేసిన తప్పుల గురించి తీవ్ర పదజాలంతో ఘాటైన విమర్శలను చేయసాగాడు.ఆ దూషణలను విన్న ఇతరులు విసిగిపోయారు. ఆర్త భక్త జన పరాయణుడైన సాయి సన్నిధిలో ఇటువంటి విమర్శలు ఏల అని మనస్సులో బాధపడసాగారు. ఆ భక్తుడు తన తోటి భక్తుడిని విమర్శిస్తూ ఎంతటి పాపం మూటకట్టుకుంటున్నారో సర్వజ్ఞుడైన సాయి గ్రహించారు. ఆ మధ్యాహ్నం శ్రీ సాయి లెండీ తొటకు వ్యాహ్యాళికొ పోయేసమయంలో ఆ భక్తుడు బాబాని దర్శించి ప్రణామం చేసాడు. అప్పుడు శ్రీ సాయి మలమును తింటున్న ఒక పందిని చూపించి " చూడు నాయనా ! అమేధ్యాన్ని ఎంతో ప్రీతిగా తింటున్న ఆ పందిని చూడు.నీ ప్రవర్తన, స్వభావము కూడా అంతే. ఎంత ఆనందంగా నీ సాటి సోదరుని తిడుతున్నావు ? కోటి జన్మలలో ఎంతో పుణ్యం చేయగా నీకీ అరుదైన మానవ జన్మ లభించింది.దీనికి సార్ధకత చేకూర్చడానికి ప్రయత్నించాలి గాని ఈ విధమైన దోషణలను చేసి ఎందుకు కొండంత పాపాన్ని మూటకట్టుకుంటున్నావు ?" సాయి మాటలతో ఆ భక్తునికి తన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే క్షంచమంటూ శ్రీ సాయి పాదాలపై పడ్డాడు. శ్రీ సాయి అప్పుడు తన బోధను ఈ విధంగా కొనసాగించారు. " చూడు నాయనా ! ఇతరులను విమర్శించువాడు, దూషణములను చేయువాడు ఒక విధంగా తాను నిందించువానికి సేవ చేస్తున్నాడు. అది ఎట్లనిన, ఇతరులను నిందించడమంటే వారి శారీరక మలినములను తన నాలుకతో నాకి శుభ్రపరచడంతో సమానం.ఇట్టి అపరిశుభ్రమైన కార్యములను చేయడం నీకు తగునా ?భగవంతుని సృష్టిలో అందరూ సమానులే ! ఆ కుల, మత, జాతి , వర్ణ వైషమ్యాలను మనము సృష్టించుకున్నాము.ఎవరి పూర్వ జన్మ సంస్కారములను బట్టి వారు జీవితంలో ప్రవర్తించడం జరుగుతుంది.వారి ప్రవర్తన మనకు నచ్చనంత మాత్రాన, వారిని విమర్శించడం తగదు.ఇతరులను దూషించడం భగవంతుని దూషణతో సమానం.ఒకరు ఇంకొకరిని దూషిస్తే నాకెంతో బాధ కలుగుతుంది, కనుక ఆ పనులను ఇక మీదట చేయవద్దు" మానవ ప్రవర్తనపై శ్రీ సాయి ఎంతటి అపూర్వమైన దివ్య బోధను చేసారో చూడండి. ఆ పరిశుద్ధ పరమేశ్వర అవతార స్వరూపునికి ప్రణమిల్లి ఆ దివ్య సందేశాన్ని మనసులో పదిల పరచుకొని ఆ ప్రకారంగా జీవించి, సాయి అనుగ్రహ, కటాక్షములకు పాత్రులమవుదాము.


సర్వం శ్రీ శిరిడీ సాయి పాదారవిందార్పణమస్తు



Saturday 26 January 2013

శ్రీ శిరిడీ సాయి దివ్య లీలావైభవం



అఖిలాంఢకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయినా శ్రీ సాయినాధుని లోని విశిష్ట ఏమిటంటే కల్పవృక్షం, కామధేనువు కంటే భిన్నంగా అడిగినవారికీ, అడగనివారికీ కూడా వారికి నిత్య జాగృతుడై, కావల్సినవన్నింటినీ సమకూర్చి, మొదట వారి భౌతిక అవసరాలను తీర్చి, పిమ్మట వారిని అధ్యాత్మిక మార్గంలో పయనింపజేస్తారు. అంతే కాక మొదటి నుండి వారి వెంట వుండి,వారిని దారి తప్పకుండా మార్గ దర్శి వలే నిలిచి,చివరికంటా గమ్యం చేరుస్తారు. తనకు సర్వస్య శరణాగతి చేసిన భక్తులకు ఎళ్ళవేళలా రక్షణ కవచాన్ని అందిస్తూ వారికి ముక్తిని ప్రసాదించే అతి శక్తివంతుడు, ఆర్తత్రాణ పరాయణుడు శ్రీసాయినాధులు. ఇప్పుడు ఆ మహనీయుడు చేసిన ఒక అద్భుతమైన లీలను స్మరించుకుందాం.

పూనా జిల్లా, జున్నూరు తాలూకా నారాయణ గ్రామము వాస్తవ్యుడు అయిన భీమాజీ పాటిల్ కు ఒకసారి ఉపిరితిత్తుల వ్యాధి సోకి, క్రమంగా అది క్షయగా పరిణమించింది. వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజులలో క్షయవ్యాధిని మృత్యు ద్వారంగా పరిగణించేవారు. స్వతాహాగా ధనవంతుడైన భీమాజీ ఎన్నో రకములైన మందులను వాడాడు, ఎందరో ప్రసిద్ధమైన దాక్టర్లకు చూపించాడు కాని ఆ వ్యాది ఇసుమంతైనా తగ్గలేదు. ఇక ప్రాణం మీద ఆశ వదులుకొని " ఓ భగవంతుడా నీవే నాకిక దిక్కు" అని రాత్రింబవళ్ళూ అతి దీనంగా ప్రార్ధించసాగాడు. అతని ప్రార్ధనలు ఆ సాయికి చేరాయా అన్నట్లుగా ఆ తర్వాత భీమాజి తన అనారోగ్యం వివరాలను సాయి భక్త శిఖామణి నానా చందోర్కర్ కు రాసాడు. అందుకు నానా " అన్ని వ్యాధులకు ఏకైక నివారణ సర్వస్య శరణాగతి చేసి సాయి పాదాలపై పడుటయే" అని సమాధానమిచ్చాడు. అప్పుడు భీమాజీ నానా సలహాపై అధారపడి తన బంధువుల సహాయంతో శిరిడీకి వచ్చి మశిదులో బాబా కాళ్ళపై పడి తన వ్యాధి తగ్గించమని ప్రాధేయపడ్డాడు. ఈ వ్యాధి అతని గత జన్మల ప్రారబ్ధ ఫలితమని, ఆ పాపములను అనుభవించి వాటి నుండి విముక్తి అవ్వడమే సరైన మార్గమని, అందువలన ఈ విషయంలో తాను కలుగజేసుకొనడం లేదని బాబా ఖచ్చితంగా చేప్పేసారు.ఆ మాటలకు హతాశుడైన భీమాజీ తనకు వెరే దిక్కు లేదని, సాయి కల్పించుకోకపోతే ఇక మరణమే శరణ్యమని కన్నీరు మున్నీరుగా సాయిని ప్రార్ధించాడు. అతని పరుశుద్ధమైన ప్రార్ధనకు బాబా హృదయం కరిగింది. అపుడు భీమాజీతో సాయి" ఊరుకో. నీ అతృతలను పారద్రోలుము. నీకష్టముల్లనీ గట్టెక్కే సమయం వచ్చింది. ఎంతటి బాధలునవారైనా తల్లి వంటి ఈ మశీదు మెట్లెక్కితే వారి కష్టములనీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీస్తాయి. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయామయుడు. నీ రోగమును తప్పక బాగు చేయును" అని ప్రేమపూర్వక పలుకులను పలికారు. ఆ కమ్మని పలుకులతో భీమాజీకి కొండంత ఊరట కలిగినట్టయ్యింది. అప్పటి వరకూ ప్రతీ అయిదు నిమిషాలకూ రక్తం కక్కుతున్న అతను సాయి సుముఖంలో ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు. సాయి వానికి నిన్ను కాపాడుతాను అని దయతో అభయం ఇచ్చినప్పటినుండి భీమాజి జబ్బు నయమవడం ఆరంభించింది. అతనిని భీమాభాయి అను వారి ఇంట వుంచమని సాయి సలహా ఇచ్చారు. ఆ ఇంటికి గాలీ, వెలుతురూ సరిగ్గా వుండక ఏమంత సౌకర్యంగా వుండదు. క్షయ రోగంతో బాధపడు వారికి ఆ ఇల్లు అసలు పనికిరాదు. కాని సాయి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం. ఆ రాత్రి అతనికి రెండు స్వప్నములు వచ్చాయి. మొదటి స్వప్నములో భీమాజి ఒక పాఠశాల విద్యార్ధిగా వున్నాడు. టీచరు చెప్పిన పద్యములను కంఠస్తం చేయకపోవడం వలన టిచరు గారు అతడిని తీవ్రంగా దెబ్బలు కొట్టారు.రెండవ స్వప్నంలోగుర్తు తెలియని వ్యక్తులు కొందరు భీమాజి చాతిపై పెద్ద బండను వేసి కిందకూ, మీదకు తొక్కడం వలన చాతిలో నొప్పి ఎక్కువగా వచ్చి భీమాజీ తీవ్రమైన బాధను అనుభవించాడు. కలలో పడిన ఈ బాధలతో అతని జబ్బు పూర్తిగా నయమైపోయింది. కొద్ది రోజులలోనే శ్రీ సాయి యొక్క ఊదీ ప్రసాదాలను తీసుకొని ఆనందంగా తన బంధువులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. సాయినాధులు తనకు చేసిన ఈ మేలును మరువక ప్రతీ నెలా శ్రీ సాయి సత్య వ్రతం అనే వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోసాగాడు.

ఈ విధంగా శ్రీ సాయినాధుల తమదైన శైలిలో తన భక్తుని వ్యాధిని తగ్గించి వేసారు.సాయి తాను తన భక్తులకు చేసిన మేలుకు ప్రతిఫలముగా ఏమీ ఆశించేవారు కాదు.వార్కి కావలసింది భక్తులు తాము పొందిన మేలును గుర్తుంచుకొని తనపై అచంచలమైన నమ్మకం కలిగి వుండడమే ! తనకు సర్వస్య శరణాగతి చేసిన భీమాజీ యొక్క కిందటి జన్మలో చేసుకున్న ప్రారబ్ద కర్మలను సైతం తప్పించి,మందులు ఆపరేషన్ లు లేకుండా కేవలం స్వప్నానుభవములతో అతి దుర్లభమైన అతని వ్యాధిని తగ్గించి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిని గావించి తదనంతరం సుఖవంతమైన నూతన జీవితం ప్రసాదించిన కరుణా మూర్తి శ్రీ సాయి. సాయి కరుణను, అపారమైన అనుగ్రహమును పొందాలంటే ఆడంబరమైన భజనలు, ఆర్భాటమైన పూజలు, యజ్ఞ యాగాదులు అవసరం లేదు. పరిశుద్ధమైన మనస్సు, ఇచ్చేది, పుచ్చుకునేది ఆ సాయియే అన్న ధృఢమైన నమ్మకం చాలు.
సర్వేజనా సుఖినోభవంతు

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు